Site icon NTV Telugu

Jogi Ramesh: నిక్కర్‌ వేసుకున్నప్పటి నుంచి నాకు పెనమలూరుతో సంబంధాలు.. జెండా ఎగరడం ఖాయం..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు వ్యవహారం హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. ఇప్పటికే మూడు లిస్ట్‌లు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. నాల్గో జాబితా రెడీ చేస్తోంది.. మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు.. ఇలా పలువరు నేతలు మరోస్థానానికి మారని పరిస్థితులు వచ్చాయి.. అయితే, కొన్ని చోట్ల పరిస్థితులు సాఫీగా ఉన్న మరికొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక, మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా పెట్టింది వైసీపీ అధిష్టానం.. తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వకర్తగా తొలిసారి పెనమలూరులో అడుగుపెట్టారు జోగి రమేష్‌.. ఆయనకు ఘన స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు. ఉయ్యూరు వీరమ్మ తల్లి దర్శనంతో పెనమలూరు సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించారు.

Read Also: Mahant Raju Das: సిద్దరామయ్య పేరులో రాముడు ఉన్నాడు కానీ అతడి ప్రవర్థన కాలనేమిలా ఉంది..

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. పెనమలూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి పెనమలూరుతో నాకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.. వంగవీటి రంగా అనుచరుడిగా నేను ఇక్కడి వారికి పరిచయమే అన్నారు. ఇక, స్థానికత అనేది తనకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. నేనేమీ చిత్తూరులో పుట్టి మంగళగిరికి రాలేదు అంటూ నారా లోకేష్‌పై సెటైర్లు వేసిన ఆయన.. నేను ఈ జిల్లాలోనే పుట్టాను అన్నారు. నా అభిమానుల పేర్లతో వెలిసిన ఫ్లెక్సీలను పెద్దగా పట్టించుకోను.. రాజకీయాల్లో ఇవన్నీ సహజం అన్నారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించినా పల్లెత్తు మాట అనని వాళ్లకు.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అవసరమా..? అని నిలదీశారు. జగన్‌ను తిట్టారు.. జోగి రమేష్‌ను తిట్టలేదు కదా? అని సైలెంట్‌గా ఉంటే రాజకీయం ఎందుకు..? అని మండిపడ్డారు. అధినేతను విమర్శిస్తే నేనైతే ఊరుకోను అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్‌.

Exit mobile version