NTV Telugu Site icon

Jogi Ramesh vs Pawan Kalyan: 2024 తర్వాత పవన్‌తో రెండు సినిమాలు తీస్తానని ఏపీ మంత్రి ప్రకటన.. సినిమా పేర్లు ఇవే..!

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh vs Pawan Kalyan: జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పెడనలో పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇదే సమయంలో.. 2024 తర్వాత పవన్‌ కల్యాణ్‌తో రెండు సినిమాలు తీస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. సినిమా పేర్లను కూడా అనౌన్స్‌ చేశారు. ఒకటి ‘జానీ-ఖూనీ’.. మరోటి ‘గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్’ అని ప్రకటించారు. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్‌ కు పనేమీ ఉండదు కదా? అందుకే ఆయనతో రెండు సినిమాలో తీస్తానంటూ ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్‌.

Read Also: Grandhi Srinivas: పవన్‌ కల్యాణ్‌పై గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కి కీలక పోస్ట్

ఇక, పెడనలో అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారని ఆరోపించారు మంత్రి రమేష్‌.. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్ళ తో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు. పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదన్నారు.. అవనిగడ్డ లో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని వ్యాఖ్యానించారు. జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అని దుయ్యబట్టారు.. పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజల పై ఆరోపణలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది అని మండిపడ్డారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాల్లో జానీ, గబ్బర్‌ సింగ్‌ ఉన్న విషయం విదితమే.. ఇప్పుడు ఆ సినిమాలను ‘జానీ-ఖూనీ’.. ‘గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్’ పేర్లతో తీస్తానంటూ ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్‌. ఇక, తనపై ఎవరైనా కామెంట్లు చేసే పవన్‌ కల్యాణ్‌.. మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలకు ఎలా కౌంటర్‌ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.