Minister Indrakaran Reddy About Forest Martyrs
తెలంగాణలో అడవుల సంరక్షణకు చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం నెహ్రూ జూలాజికల్ పార్క్లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్కుమార్ హరితహారం, అడవుల సంరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన అటవీశాఖాధికారులకు నివాళులు అర్పిస్తూ, అటవీశాఖ సిబ్బంది త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. 1984వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్యం, అంకితభావంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడుతూ తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారని తెలిపారు.
2021-2022 సంవత్సరంలో అటవీ అధికారులు మొత్తం 11,669 కేసులు నమోదు చేసి, అటవీ సంరక్షణలో భాగంగా రూ.14.07 కోట్ల జరిమానా విధించారని, రూ. 7.31 కోట్ల విలువైన కలప, 1,133 అటవీ భూముల ఆక్రమణపై కేసులు నమోదు చేయడమే కాకుండా 1,634 వాహనాలను జప్తు చేశారని తెలిపారు. అటవీ శాఖను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగులు, సిబ్బంది నియామకాలు చేపడుతోందని, ఈ ఏడాది 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు. దీంతోపాటు 2,173 వాహనాలను అటవీశాఖ అధికారులు, సిబ్బందికి అప్పగించారు.