Ambati Rambabu: బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి అంబటి

Ambati

Ambati

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో పొత్తు లేకుండా సింగిల్‌గానే పోటీ చేస్తుంది.. కానీ, బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కొన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. బీజేపీతో మాకు తెర వెనుక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవమని కొట్టిపారేశారు.. అలాంటి ప్రచారాలను వైసీపీ ఖండిస్తుందన్నారు. వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ.. ఏ పార్టీతో మాకు పొత్తు లేదని క్లారిటీ ఇచ్చారు.. మాకు ఎవరికీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

Read Also: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు

అయితే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాల కోసం.. కేంద్రం సహకారం కోసం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుతూ ఉంటాం అన్నారు అంబటి రాంబాబు.. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, పేద బడుగు బలహీన వర్గాల బలంతోనే వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు. ఏ రాజకీయ పార్టీలకు వైసీపీ కొమ్ము కాయదు అని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ వైసీపీ-బీజేపీ సంబంధాలపై మంత్రి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో అన్ని విధాలుగా సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన తర్వాత.. ఆ పొత్తు అనైతికమైనది అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టిన విషయం విదితమే.