NTV Telugu Site icon

Minister Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లు.. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు..

Adimulapu Suresh

Adimulapu Suresh

Minister Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లు.. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. విజయవాడలో నిర్వహించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఒకరోజు కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ ముందు జరిగే కాంక్లేవ్ ఎంతో అద్భుతం అన్నారు. విద్యా విధాన విలువలకు అంబేద్కర్ కదపలేని‌ పునాదిగా అభివర్ణించారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు.. పేదరికంలో ఉన్నవారు విద్యకు దూరం కాకూడదన్న ఆయన.. అందుకే జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాజిక సాధికారత ముఖ్యంగా జరిగాయి.. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వం యొక్క రెండు కళ్లుగా పేర్కొన్నారు.

Read Also: Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్

చిట్ట చివరి కుటుంబానికి కూడా సంక్షేమం అందాలి అని పని చేశామని తెలిపారు సురేష్.. ఏ పథకాలైనా అట్టడుగు వర్గాలకు చేరాలి అని పని చేశాం.. విద్య మీద మా ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టింది.. కేంద్రం రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అంటే మా ప్రభుత్వం రైటు టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ అని మార్చి అమలు చేసిందన్నారు. తెలుగు భాష గౌరవం తగ్గకుండా ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ని అమలు చేశామని వెల్లడించారు. ఇక, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భావజాలం పుణికి పుచ్చుకుని అమలు చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం.. కేబినెట్‌లో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని తెలిపారు. చట్ట సభల్లో ఇవాళ్లి వరకూ అడుగుపెట్టని కులాలను పార్లమెంటు వరకూ తిసుకెళ్లిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆలయ పాలకమండలిల్లో, అధ్యక్ష పదవులలో దళితులకు అవకాశం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు. మరోవైపు.. విగ్రహం నిర్మించిన స్ధలం చాలా కాలంగా ఖాళీగా ఉంది.. ఆ స్ధలాన్ని గత ప్రభుత్వంలో వ్యాపార ధోరణిలోనే చూశారు.. సామాజిక స్పృహ లేకుండా గత ప్రభుత్వంలో ఆలోచించారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.