Site icon NTV Telugu

MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..

Mgnrega

Mgnrega

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి పెను మార్పులు తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ఇకపై వీబీ జీ రామ్ జీ (VB GRAMJI – వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్) గా కొత్త రూపు సంతరించుకోనుంది. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా.. పని దినాల సంఖ్య, పనుల ఎంపిక .. అమలు తీరులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పనుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉపాధి హామీలో సరికొత్త మార్పులు..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం వల్ల కూలీలకు , గ్రామ పంచాయతీలకు కొన్ని కీలక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకు ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించగా, కొత్త పథకంలో ఆ గడువును 125 రోజులకు పెంచారు. దీనివల్ల కూలీల వార్షిక ఆదాయం పెరగనుంది. అంతే కాకుండా.. గతంలో పనుల ఎంపికలో మండల స్థాయి అధికారుల జోక్యం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గ్రామ అవసరాలను బట్టి అక్కడి పంచాయతీలే పనులను ఎంచుకునే అధికారం కల్పించారు. అంటే ఫుల్ పవర్స్ గ్రామ పంచాయతీలకే ఇచ్చారు.

Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?

కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా అంగన్‌వాడీ భవనాలు, స్కూల్ టాయిలెట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యామ్‌ల వంటి శాశ్వత నిర్మాణాలకు కూడా దీనిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త పథకంలో 266 రకాల పనులను చేర్చినప్పటికీ.. గతంలో రైతులకు ఎంతో మేలు చేసిన కొన్ని పనులను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా.. చెరువుల నుంచి పొలాలకు ఒండ్రుమట్టి తరలింపు, వ్యక్తిగత పొలాల్లో భూమిని చదును చేయడం, పిచ్చిమొక్కలు లేదా కంపచెట్ల తొలగింపు వంటి పనులకు ఇకపై అనుమతి ఉండదు.

ఒండ్రుమట్టి వల్ల పొలాలు సారవంతం అవుతాయని, ఈ పనులను మే నెల వరకు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పాత పద్ధతిలో చేసే పనులన్నీ ఈ ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం భూ అభివృద్ధి పనులకు కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది.

Exit mobile version