Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!

Meenakshi Natarajan

Meenakshi Natarajan

Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన నామినేషన్ తిరస్కరణకు కారణంగా చెబుతున్న అంశాలపై వివరణ ఇచ్చిన ఆమె.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అన్నారు. లీగల్ నోటీసు మాత్రమే వచ్చిందని, అది కూడా ఒక ప్రైవేట్ పిటిషన్‌కు సంబంధించినదేనని తెలిపారు. ఫార్మ్-26లో లీగల్ నోటీసులను తప్పనిసరిగా పేర్కొనాల్సిన నిబంధన లేదని చెప్పారు.

ప్రైవేట్ పిటిషన్ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఇంచార్జిగా కూడా లేనని తెలిపారు. నాంపల్లి కోర్టు కూడా ఆ కేసు తన పరిధిలోకి రాదని పేర్కొన్నట్లు చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన మహిళకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని ఆమె వెల్లడించారు. ఫిర్యాదులో ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు టికెట్ కూడా నిరాకరించామని చెప్పారు. పార్టీ పరంగా అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. తన నామినేషన్ తిరస్కరణపై తాను నిరాశ చెందలేదని, ఇప్పటికే ఎన్నికల పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

×
×
Ad

రాజ్యసభకు వెళ్లేందుకు తెలంగాణ నుంచి ఎవరినైనా తప్పించి తనను పంపించే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతి నాయకుడు తమకు ముఖ్యమేనని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో తనపై పార్టీలోనే కుట్ర జరిగిందన్న ఆరోపణలను కూడా మీనాక్షి నటరాజన్ కొట్టిపారేశారు. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపిందని, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్‌లో కూడా సంఖ్యాబలం లేకుండానే బీజేపీ పోటీకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా సంఖ్యాబలం ఉందని, బీజేపీకి మూడో సీటు గెలిచేంత మంది ఎమ్మెల్యేలు లేరని ఆమె పేర్కొన్నారు.