Swathi Mother Call for Death Penalty for Mahender: బోడుప్పల్లోని బాలాజీ హిల్స్లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐదు నెలల గర్భవతైన భార్య స్వాతి (25)ని ఆమె భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో పడేశాడు. మరికొన్ని మృతదేహా ముక్కలను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమవ్వగా దొరికిపోయాడు. నిందితుడు మహేందర్ని పోలీసులు అదుపులోకి తీసుకునీవిచరిస్తున్నారు. స్వాతి మృతితో ఆమె స్వగ్రామం కామారెడ్డిగూడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూతురి మృతితో తల్లి స్వరూప బోరున విలపిస్తున్నారు.
స్వాతి తల్లి స్వరూప మాట్లాడుతూ… ‘నా కూతుర్ని మహేందర్ మాయ చేసి ఎత్తుకొని పోయాడు. డిగ్రీ చదువుతున్న నా కూతురుకి మాయ మాటలు చెప్పి ప్రేమించాడు. మహేందర్ మాయలో పడిపోయి ఇంటి నుంచి నా కూతురు వెళ్ళిపోయింది. ప్రేమ వివాహం వద్దని చెప్పి మేము వారించాము. మా మాట నా కూతురు వినకుండా మహేందర్ని పెళ్లి చేసుకుంది. మహేందర్ కూడా మా ఇంటి పక్కనే ఉంటాడు. ప్రేమ వివాహం చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా ఉండమని చెప్పి.. బంగారం, డబ్బులు ఇచ్చి పంపాము. కొన్ని రోజుల నుంచి చిత్ర హింసలు పెడుతున్నట్లు నా కూతురు చెప్పింది. మహేందర్ తనను ఎప్పుడైనా చంపుతాడని భయం వ్యక్తం చేసింది. స్వాతి అత్త-మామలు, మహేందర్ కలిసి నా కూతుర్ని చంపారు. కొన్ని రోజుల నుంచి నా కూతురుతో ఫోను కూడా మాట్లాడనివ్వలేదు. దొంగ చాటుగా నా కూతురు ఫోన్లో మాట్లాడితే కొట్టేవాడు. నా కూతుర్ని కిరాతకంగా చంపిన వాడికి ఉరిశిక్ష వేయాలి. నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. మీ తోటి కాకుంటే చెప్పుర్రి సార్.. ఆ నా కొడుకుని నేనే చంపేస్తా’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Realme New Phone: రియల్మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!
స్వాతి తండ్రి మాట్లాడుతూ… ‘నా కూతుర్ని మహేందర్ కిరాతకంగా హత్య చేశాడు. వరకట్నం కోసం నా కూతురు టార్చర్ చేశాడు. నా కూతురు గర్భవతి. నా కూతురు మహేందర్ ఇబ్బందులు పెట్టిన విషయాన్ని మా దృష్టికి తెచ్చింది. మేము పంచాయతీ కూడా పెట్టాము, కలిసి ఉండాలని చెప్పాం. ప్రేమ వివాహం వద్దని చెప్పి వారించాము, ఇద్దరూ వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. మాట నా కూతురు వినకుండా మహేందర్ని వివాహం చేసుకుంది. మహేందర్ది కూడా మా ఊరే. కొన్ని రోజుల నుంచి నా కూతుర్ని చిత్ర హింసలు పెడుతున్నట్లు చెప్పింది. మహేందర్ తనను ఎప్పుడైనా చంపుతాడని భయం వ్యక్తం చేసింది. నా కూతురు ఫోన్లో మాట్లాడితే కొట్టేవాడు. మాతో మాట్లాడించేవాడు కాదు. నా కూతుర్ని కిరాతకంగా చంపిన మహేందర్కి ఉరిశిక్ష వేయాలి’ అని కోరాడు.