ఆ జిల్లాలో ఖద్దర్ వర్సెస్ కలెక్టర్ అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా? యంగ్ ఎమ్మెల్యే అండ్ డైనమిక్ కలెక్టర్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉందా? వివాదం హద్దు దాటుతోందని గమనించిన కాంగ్రెస్ సీనియర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారా? ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతమా లేక తుఫాన్ ముందు ప్రశాంతతా? ఎవరా ఇద్దరు యంగ్స్టర్స్? ఎమ్మెల్యేకి, కలెక్టర్కి ఎక్కడ చెడింది?
మెదక్ జిల్లా కలెక్టర్గా ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాధ్యతలు తీసుకున్నారు ప్రతిమా సింగ్. గతంలో ఇక్కడే అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఆమెది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే మెదక్ ఎమ్మెల్యే అయిపోయారు మైనంపల్లి రోహిత్. కానీ… జనం కోసం కలిసి పని చేయాల్సిన ఈ ఇద్దరు యంగ్స్టర్స్ వ్యవహారం ఇప్పుడు పిల్లి, ఎలుక చందంగా మారిందన్నది లోకల్ టాక్. జిల్లా కలెక్టర్, మెదక్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు, కలెక్టర్ లీవ్లో ఉండటం లాంటివి ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ధాన్యం కొనుగోళ్లేనని సమాచారం.
ధాన్యం కొనుగోళ్లలో జరిగిన ఆలస్యం ప్రభావం స్థానిక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే రోహిత్పై పడింది. రైతులంతా రోడ్డెక్కడంతో… ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అయ్యారట. చివరికి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోవడం వల్లే నియోజకవర్గంలో తనకు డ్యామేజ్ అవుతుందని ఎమ్మెల్యే రోహిత్ గ్రహించినట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అదే ఊపులో ఆయన కలెక్టర్, అధికారులపై బహిరంగంగానే సీరియస్ అయ్యారు. అలాగే… మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓ కాంట్రాక్ట్ను కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇప్పించే ప్రయత్నం రోహిత్ చేయగా… అందుకు కలెక్టర్ ఒప్పుకోలేదని తెలిసింది.
పైగా… ప్రజా సమస్యల పరిష్కార క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్కు ఫోన్ చేసినా ఆమె స్పందించడం లేదన్న ఆగ్రహం కూడా ఉందట ఎమ్మెల్యేకి. ఇలా… ఒకటికి ఒకటి కలిసి రకరకాల కారణాలతో కలెక్టర్, రోహిత్ మధ్య అగాధం పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవలి కాలంలో ఇద్దరూ కలిసి పాల్గొన్న కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనాసరే…. ఎమ్మెల్యే వస్తే కలెక్టర్ రారు, కలెక్టర్ అటెండ్ అయితే ఎమ్మెల్యే హాజరుకారన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. ఇలా ఇద్దరి మధ్య కోల్ట్ వార్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని అంటున్నారు.
ఇదిలా ఉండగా… మెదక్లోని ఓ ఆస్పత్రిలో అప్పడే పుట్టిన శిశువుని నర్సులు అమ్మేశారు. ఈ ఘటనని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా… ఆ ఆస్పత్రిని సీజ్ చేయించారు. దాన్నుంచి తప్పించుకుని తిరిగి వ్యాపారం నడుపుకేందుకు సదరు ఆసుపత్రి యజమాని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారట. అయినా సరే… ఆస్పత్రి రీ ఓపెన్ విషయంలో తగ్గేదే లేదని ప్రతిమా సింగ్ తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీనికి సంబంధించి కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య కోల్డ్వార్ గట్టిగానే నడిచిందట.
ఈ క్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ తీరును కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని, ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఫిర్యాదు చేశారన్నది ఇంటర్నల్ టాక్. జిల్లా నుంచి ఆమెని ట్రాన్స్ ఫర్ చేయాలని కూడా కాంగ్రెస్ లీడర్స్ ప్రభుత్వ పెద్దల్ని వత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారం మరింత ముదరడంతో సీఎం పేషీ నుంచి కూడా దీనిపై ఆరా తీశారట. సరిగ్గా ఇదే టైంలో ఎమ్మెల్యే రోహిత్ తండ్రి, సీనియర్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు ఈ ఇష్యూలోకి ఎంటరవడం లేటెస్ట్ డెవలప్మెంట్.
తన కుమారుడు రోహిత్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులతో మాట్లాడి రెండు పక్షాల మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారట మైనంపల్లి. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందంటూ సీనియర్గా నచ్చజెప్పినట్టు తెలిసింది. దీంతో… ప్రస్తుతానికి వ్యవహారం సద్దుమణిగినట్టు చెప్పుకుంటున్నారు. వివాదానికి ఫుల్స్టాప్ పడ్డట్టేనా? లేక కామా మాత్రమేనా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

