మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్కు కేరళలో ఊహించని సంఘటన ఎదురైంది. తన అభిమాన నటిని చూడాలనే ఆత్రుతలో ఒక మహిళా అభిమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. కేరళలోని పాలక్కాడ్లో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్కు మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని స్టేజ్ దగ్గరకు వచ్చి మంజు వారియర్ను కలవడమే కాకుండా ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకుంది.
ఈ అకస్మాత్తు పరిణామంతో మంజు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన అక్కడి యాంకర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. బహిరంగ వేదికపై సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సదరు మహిళను మందలించారు. అయితే దీనిపై ఆ మహిళ స్పందిస్తూ.. “నాకు మంజు అక్క అంటే ప్రాణం. ఆ అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నాను తప్ప మరో ఉద్దేశం లేదు” అని బదులిచ్చింది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా అసహనం వ్యక్తం చేస్తారు. కానీ మంజు వారియర్ మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారు. ఆ సమయంలో అసౌకర్యానికి గురైనప్పటికీ, ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ఆ అభిమానిని పలకరించి ఆ తర్వాత కూడా ఏమీ జరగనట్లుగా మిగతా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి తన మంచితనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.