ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. తక్షణమే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును సిసోడియా కోరారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 18 వరకు కస్టడీ పొడిగించింది. గతంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 9, 2023న మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అంతకముందు ఇదే కేసులో ఫిబ్రవరి 26, 2023న ఆయన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. దీంతో గతేడాది ఫిబ్రవరి 28న ఢిల్లీ మంత్రివర్గం నుంచి సిసోడియా తప్పుకున్నారు. తన పదవికి ఆయన రాజీనామా చేశారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఇటీవల మాత్రం భార్యకు ఆరోగ్యం బాగోలేని కారణాన తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తిరిగి జైలుకు వెళ్లిపోయారు. తాజా బెయిల్ పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కూడా కోర్టులు తోసిపుచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక తాజాగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి అతిష్ ఆరోపించింది.