Rajya Sabha Seat: రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ.. సీట్ ఆశిస్తున్న మందకృష్ణ!

  • విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ
  • ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
  • రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ
  • నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు అన్ని సిద్ధం
Manda Krishna Madiga

Manda Krishna Madiga

ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఏపీలో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్‌ గడువు ముగియనుంది. అయినా కూడా ఇప్పటివరకు కూటమి నుంచి నామినేషన్ దాఖలు అవ్వలేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ కూటమి నిర్ణయం తీసుకుంది. బీజేపీ కోటాలో తమిళనాడుకు చెందిన అన్నామలై రేసులో ఉన్నట్లు నేతలు అంటున్నారు. మరొకవైపు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. మందకృష్ణ పేరును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఏదేమైనా నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు అన్ని కూటమి సర్కార్ పూర్తి సిద్ధం చేసి ఉంచింది. అభ్యర్థి ఎవరైతే వారి వివరాలు, సంతకం మినహా మిగిలిన వ్యవహారం మొత్తంని కూటమి నేతలు సిద్ధం చేశారు. ఈరోజు రాత్రికి రాజ్యసభ అభ్యర్థిని కూటమి నేతలు ప్రకటించే అవకాశం ఉంది.