Mamata Benerjee: కేంద్ర స‌ర్కార్‌పై దీదీ పాట.. నిధులు రిలీజ్‌ చేయడం లేదంటూ నిరసన గాత్రం

Mamata

Mamata

Mamata Benerjee: రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేవంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పాటు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు రిలీజ్‌ చేయడం లేదంటూ నిరసన గాత్రం వినిపించారు. బెంగాళీ భాషలో ఆమె పాట పాడారు. ధర్నాలో రెండో రోజు ఉదయం మమతా బెనర్జీ స్వయంగా పాట పాడడం గమనార్హం. ధ‌ర్నా చేస్తున్న వేదిక‌పైనే త‌న నిర‌స‌న గాత్రాన్ని వినిపించారు. కేంద్ర ప్రభుత్వం త‌మ‌కు నిధుల‌ను విడుద‌ల చేయ‌డం లేద‌ని మమత ఆరోపించారు. ప‌నికి ఆహార‌ప‌థ‌కంతో పాటు అనేక పథకాలకు చెందిన నిధుల్ని కేంద్రం రిలీజ్ చేయ‌డంలేద‌ని ఆమె తెలిపారు.

Read Also: Viral Video: థియేటర్‌ యాజమాన్యం నిర్వాకం.. టికెట్‌ ఉందని ప్రాధేయపడినా.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా.. నిధుల గురించి ధర్నా చేపట్టిన సీఎం మమతా బెనర్జీ కొత్త రాగం అందుకున్నారు. బీజేపీని గద్దె దించటం కోసం కలసి పోరాడుదాం అంటూ తన వైఖరిని మార్చుకున్నారు. గతంలో తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని ప్రకటన చేసిన మమత.. దేశంలో తాజా పరిణామాలతో కొత్త పాట పాడుతున్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని మమత పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యం కావాలని పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తాను దీక్ష చేస్తున్నానని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదని మమతా బెనర్జీ వెల్లడించారు. ఇక నిరసన ప్రదర్శనకు అయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా దీక్ష చేస్తానని తేల్చి చెప్పారు.