NTV Telugu Site icon

Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం

Maldives

Maldives

Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు మాల్దీవుల ప్రతిపక్షం సిద్ధమైంది. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంపై మాల్దీవుల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రక్రియను ప్రారంభించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించడానికి అవసరమైనంత సంతకాలను సేకరించింది. చైనా అనుకూల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని త్వరలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్‌ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతు ఇచ్చినట్లు మాల్దీవుల ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ అధాధు పేర్కొంది.

Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..

కాగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ప్రభుత్వం ఆమోదం కోసం ఆదివారం మాల్దీవుల పార్లమెంట్‌ సమావేశంలో కీలక ఓటింగ్‌ సందర్భంగా ఘర్షణ జరిగింది. స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్ష సభ్యులు దాడి చేశారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC), ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM)తో కూడిన అధికార కూటమికి చెందిన ఎంపీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీతో ఘర్షణ పడ్డారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్‌ సమావేశం సందర్భంగా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Read Also: Rajyasabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. ఎంపీలు స్పీకర్ కుర్చీ దగ్గర గుమిగూడి ఆందోళనకు దిగినట్లు కనిపించింది. కందితీము ఎంపీ అబ్దుల్లా హకీమ్ షహీం, కేంధికుల్హుదూ ఎంపీ అహ్మద్ ఈసాల మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఛాంబర్ దగ్గర పడడంతో షహీం తలకు గాయమైంది. ఓటింగ్‌కు ముందు ముయిజ్జు క్యాబినెట్‌లోని నలుగురు సభ్యులకు పార్లమెంటరీ ఆమోదాన్ని నిలిపివేయాలని ఎండీపీ నిర్ణయించిన తర్వాత పార్లమెంట్‌లో హింస జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అనుకూల ఎంపీలు నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు అధికార సభ్యులు పార్లమెంటుకు అంతరాయం కలిగించడంపై ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే హోం మంత్రి అలీ ఇహుసన్, రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్‌ ఆమోదాన్ని నిరాకరించాలని నిర్ణయించింది. కేబినెట్‌కు పార్లమెంటు ఆమోదం నిరాకరించడం పౌరులకు ప్రభుత్వం అందించే సేవలను అడ్డుకున్నట్లే అవుతుందని పాలక కూటమి పేర్కొంది.