NTV Telugu Site icon

Delhi: బేబీ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు నవజాత శిశువులు దహనం

Fire Accident

Fire Accident

ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని రెండంతస్తుల బేబీ డే కేర్ సెంటర్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కేంద్రంలో 11 మంది నవజాత శిశువులు జాయిన్ అయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో సంఘటన ప్రదేశానికి చేరుకుని కొందరిని రక్షించింది. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీపంలోని గుప్తా నర్సింగ్ హోమ్, తూర్పు ఢిల్లీ అడ్వాన్స్‌డ్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. సంఘటన ప్రదేశానికి పోలీసు బృందాలు, రెస్క్యూ టీమ్ చేరుకుని పలువురు నవజాత శిశువులను రక్షించారు.

Read Also: Surya Stotram: వైశాఖమాసం ఈ స్తోత్ర పారాయణం చేస్తే జీవితాంతం ఆయురారోగ్యాలు

కాగా, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం తర్వాత బేబీ కేర్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగులు పరారీ అయ్యారు. ఈ ప్రమాదంపై కనీసం బాధితుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. శనివారం రాత్రి 11:30 గంటలకు బేబీ కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ సురేంద్ర చౌదరి చెప్పుకొచ్చారు.

Read Also: SRH vs KKR Final Match: మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..

బేబీ కేర్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పొగలు రావడాన్ని ప్రజలు చూశారు. ఆ కొద్దిసేపటికే మంటలు పై అంతస్తులకు చేరాయి. మంటలు ఒక్కసారిగా భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంరక్షణ కేంద్రం వెనుక వైపు నుంచి అద్దాలు పగులగొట్టి, నవజాత శిశువులను ఒక్కొక్కరిని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన నవజాత శిశువులందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పుకొచ్చిందని అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర చౌదరి వెల్లడించారు. అయితే, బేబీ కేర్ కేంద్రానికి ఇరువైపులా ఉన్న నాలుగు అంతస్తులు, రెండంతస్తుల భవనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో పాటు ఈ సెంటర్ కు 100 మీటర్ల దూరంలో ఉన్న ఐటీఐ క్యాంపస్‌లో ఒక సిలిండర్ పేలడంతో స్థానిక ప్రజలు భయపడిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు.