మహారాష్ట్రలో మరాఠీ భాషపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ నేర్చుకునేందుకు మరో ఏడాది గడువు ఇచ్చింది. ఈ కాలంలో భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్ల లైసెన్స్లు, పర్మిట్లు రద్దు చేయబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్స్లు, పర్మిట్లు రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చ, నిరసనలు మొదలయ్యాయి. ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తమ సమస్యలను వివరించారు. మరాఠీ నేర్చుకునేందుకు డ్రైవర్లకు మరో ఏడాది సమయం ఇవ్వాలని కోరారు. వారి విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం.. అదనంగా ఏడాది గడువు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది వ్యవధిలో మరాఠీ భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరాఠీయేతర ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
మరాఠీ భాషపై రాజకీయ వేడి
మహారాష్ట్రలో మరాఠీ భాష వినియోగం, తప్పనిసరి చేయాలనే నిబంధనలపై కొంతకాలంగా రాజకీయంగా వేడి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్స్లు, పర్మిట్లకు మరాఠీ భాషా నైపుణ్యాన్ని అనుసంధానించాలనే నిర్ణయంపై విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు ఏడాది గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పరిస్థితిని కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

