భారతీయ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోంస్లే మరణం పట్ల సంగీత జ్ఞాని ఇళయరాజా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేవలం ఒక గాయనిగా మాత్రమే కాకుండా, తనపై ఒక తోబుట్టువులా ప్రేమను చూపించిన ‘ప్రియమైన సోదరి’ని కోల్పోయానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
Also Read: NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
‘ఈరోజు ఆశా భోంస్లే గారు మనల్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను తీవ్ర విచారానికి గురిచేసింది. ఇది కేవలం ఒక అధికారిక సంతాప సందేశం కాదు.. ఆమెకు నాపై ఎంతో ప్రేమ, మమకారం ఉండేవి. ఎప్పుడు చెన్నైకి వచ్చినా, టీవీ ఇంటర్వ్యూలు లేదా ఇతర పనులపై వచ్చినా సరే.. నన్ను కలవకుండా ఆమె తిరిగి వెళ్లేవారు కాదు. ఒక సంగీత దర్శకుడిగా నా పట్ల ఆమె చూపిన గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ నా గుండెల్లో భద్రంగా ఉంటాయి’ అని ఇళయరాజా గుర్తుచేసుకున్నారు. ఆమె గాత్రం గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆమెది ఒక విలక్షణమైన స్వరం. ఏ ఇతర గాత్రాలతోనూ ఆశా భోంస్లేను పోల్చలేం. ఆమె ప్రతిభ అంతులేనిది, విశిష్టమైనది. ఆమె స్వరం ఈ చిత్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ దేవుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను’ అంటూ ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు దక్షిణ భారతీయ సంగీతంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
