Madras High Court Reopens corruption Case against former CM Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు షాక్ తగిలింది. 11 ఏళ్ల తర్వాత అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. వివరాల ప్రకారం.. 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. రూ. 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే 2011లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దీంతో అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Also Read: Viral Video: ఆసుపత్రిలో తుపాకీతో కాల్పులు.. వైరల్ వీడియో
అయితే ఈ నేపథ్యంలోనే నిందుతులపై ఉన్న ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో శివగంగ కోర్టు 2012లో ఈ కేసులో ఛార్జిషీట్ దఖాలైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ లతో పాటు ఆరగురిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. అయితే ఏసీబీ విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వీరు కేసు నుంచి బయటపడ్డారు. అయితే 11 ఏళ్ల తరువాత ఈ కేసును సుమోటాగా తీసుకొని పునర్విచారించేందుకు మద్రాస్ హైకోర్టు సిద్దమయ్యింది.
ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ, దిగువ కోర్టులపై కూడా ఉన్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్షాలపై కేసులు పెట్టడం మళ్లీ ప్రతిపక్షాలు అధికారంలోకి రాగానే ఆ కేసులు లేకుండా చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో అలవాటుగా మారిపోందని, ఈ విషయంలో అవినీతి విచారణ సంస్థలు కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని… ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే పన్నీర్ సెల్వం కేసుపై పునర్విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. దీంతో పన్నీర్ సెల్వం మరోసారి చిక్కుల్లో పడినట్లు అయ్యింది.