NTV Telugu Site icon

Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇంటి కూల్చివేత కేసులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇండోర్ హైకోర్టు చురకలంటించింది. ఎవరి ఇంటినైనా కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది. బుల్డోజర్‌తో ఇంటిని కూల్చిన చర్యపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వివేక్ రుషియా మాట్లాడుతూ.. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఇప్పుడు ఏ ఇంటినైనా కూల్చివేయడం ‘ఫ్యాషన్’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

Read Also: Hemant Soren: హేమంత్‌కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!

ఉజ్జయినిలో ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడిపై దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, మున్సిపల్‌ అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. ఈ చర్యలపై రాహుల్‌ భార్య రాధ కోర్టును ఆశ్రయించింది.

Read Also: Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు

ఈ భవనంపై చర్య తీసుకొనే సమయంలో ప్రస్తుత యజమానులకు కాకుండా గత యజమానులకే నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తమ గృహం అక్రమ నిర్మాణం కాదని ఆమె వాదించారు. ఆ ఇల్లు హౌసింగ్‌ బోర్డులో నమోదైందని.. బ్యాంకు లోన్‌ కూడా పొందామన్నారు. ఈ కేసుపై విచారణ అనంతరం జస్టిస్‌ వివేక్‌ రుషియా తీర్పు వెలువరించారు. ఇంటిని కూల్చివేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఇళ్లను కూల్చడం, అనంతరం వాటిని పేపర్‌లో పబ్లిష్‌ చేయించుకోవడం ఫ్యాషన్‌గా మారిందని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని కూల్చే బదులు రెగ్యులరైజ్‌ చేయించుకోవాలని సూచిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండానే కూల్చివేతలకు పాల్పడ్డారని ఉజ్జయిని అధికారులపై జస్టిస్‌ వివేక్ రుషియా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధకు రూ.లక్ష, ఆమె అత్త విమలా గుర్జర్‌కు మరో రూ.లక్ష పరిహారం కింద ఇవ్వాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే న్యాయమూర్తి తీర్పుపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని చెప్పారు.