NTV Telugu Site icon

AP CM Chandrababu: సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ యాజమాన్యం భేటీ

Cm Chandrababu

Cm Chandrababu

AP CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది.

Read Also: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్

ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్ తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సిఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ ఛైర్మన్‌తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.