T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!

Cricket

Cricket

T20 Cricket: టీ20 క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ధనాధన్ సిక్సర్లు, మెరుపు అర్ధశతకాలు, ఫోర్ల వర్షం. కానీ, ఈ ఫాస్ట్ ఫార్మాట్‌లో బ్యాటర్ల వీరబాదుడు మాత్రమే కాదు.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో టీమ్‌కు కుప్పకూలుతుంటాయి. భారీ షాట్లతో విరుచుకుపడదామని మైదానంలోకి అడుగుపెట్టిన జట్లు, పరుగుల వేట పక్కనబెట్టి క్రీజులో నిలదొక్కుకోవడానికే అష్టకష్టాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌ చరిత్రలో బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అత్యల్ప స్కోర్లకే ఆలౌటై దారుణమైన రికార్డులను మూటగట్టుకున్న జట్ల వివరాలు క్రికెట్ అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఈ అవాంఛనీయ జాబితాలో అందరికంటే అగ్రస్థానంలో నిలిచి అత్యంత దారుణమైన రికార్డును తన పేరిట లిఖించుకుంది ఐవరీ కోస్ట్. 2024 నవంబర్ 24న నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యచేధనకు దిగిన ఐవరీ కోస్ట్ బ్యాటర్లు కనీసం దశాంశం దాటలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్ల దాటికి కేవలం 7.3 ఓవర్లలోనే చేతులెత్తేశారు. కేవలం 7 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 0.93 సగటు రన్ రేట్‌తో నమోదైన ఈ స్కోరు, అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే అత్యల్ప టీమ్ స్కోరుగా మిగిలిపోయింది.

ఇక రెండో అత్యల్ప స్కోరు రికార్డును ఇద్దరు పంచుకున్నారు. అందులో ఒకటి మంగోలియా కాగా, మరొకటి ఐల్ ఆఫ్ మ్యాన్. 2024 సెప్టెంబర్ 5న సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన మంగోలియా, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి నిలవలేక 10 ఓవర్లలో సరిగ్గా 10 పరుగులకే కుప్పకూలింది. సరిగ్గా ఇలాంటి ఘటనే 2023 ఫిబ్రవరి 26న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. స్పెయిన్ సంచలన బౌలింగ్‌కు ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు క్యూ కట్టింది. 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ చిన్న లక్ష్యాన్ని స్పెయిన్ అత్యంత సులువుగా ఛేదించింది.

మంగోలియాకు టీ20 ప్రయాణం అస్సలు కలిసిరావడం లేదనడానికి ఈ జాబితాలో ఆ జట్టు మరోసారి కనిపించడమే నిదర్శనం. 2024 మే 8న జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన మంగోలియా, 8.2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు ఐవరీ కోస్ట్ కూడా మరోసారి ఈ దారుణ రికార్డుల జాబితాలో తన పేరు నమోదు చేసుకుంది. 2026 మే 24న రువాండాతో జరిగిన పోరులో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఐవరీ కోస్ట్, ఒక్కో పరుగు కోసం అల్లాడిపోయింది. 15.2 ఓవర్ల పాటు పోరాడినప్పటికీ బోర్డుపై కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రువాండా ఏకపక్షంగా విజయాన్ని అందుకుంది. బౌండరీల మోతతో రంజింపజేసే టీ20ల్లో ఈ తరహా స్కోర్లు నమోదు కావడం నిజంగానే అభిమానులను ఆశ్చర్యపరిచే విషయమని చెప్పాలి.