Lashkar-e-Taiba: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో (2020 నుంచి) పాకిస్థాన్లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు. పాకిస్థాన్లో జరిగిన ఓ సభలో అతడు మాట్లాడుతూ.. ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలాకోట్ వంటి వివిధ ప్రాంతాలలో తమ క్యాడర్ను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు జరిగాయని పేర్కొన్నాడు.
మతవిద్వేష పూరిత ప్రసంగం
తన ప్రసంగంలో ఈ నష్టాన్ని అంగీకరించడమే కాకుండా, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రిజ్వాన్ హనీఫ్, తమ సిద్ధాంతాలను సమర్థించుకుంటూ ఇతర విశ్వాసాలను తీవ్రంగా అపహాస్యం చేశాడు. ఉగ్రవాద సంస్థలు ప్రజలను రాడికలైజ్ చేయడానికి, తమ పప్పులు ఉడకబెట్టుకోవడానికి మతాన్ని ఎలా ఆయుధంగా వాడుకుంటాయనే దానికి ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల చేతిలో వరసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా లష్కరే తొయిబా ఉన్నత స్థాయి నాయకుడే తమ ముఠాకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంగీకరించడం గమనార్హం.

