ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా.. లేదంటే గుర్తించినా కఠిన చర్యలు ఉంటాయని పాకిస్థాన్ నాయకులకు లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. హత్య, విధ్వంసం, నాశనం ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. బహిరంగ హెచ్చరికలో పాకిస్థాన్లో భారీ విధ్వంసం ఉంటుందని సూచించాడు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్లో జిహాదీ ఉగ్రవాద సంస్థల ప్రభావంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దేశ రాజకీయ, భద్రతా వ్యవస్థపై తీవ్రవాద బృందాలు ఏ మేరకు ఒత్తిడిని కొనసాగిస్తున్నాయనే దానిపై ప్రశ్నలను లేవనెత్తాయి. ఒకప్పుడు తన సొంత వ్యవస్థలోనే పోషించబడ్డాయని ఆరోపించబడిన ఉగ్రవాద సంస్థలతో వ్యవహరించడంలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాలును ఇటువంటి బెదిరింపులు ఎత్తి చూపుతున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల అబ్రహం ఒప్పందంలో చేరాలని పాకిస్థాన్, ఇతర ముస్లిం అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్, టర్కీ వంటి దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. ఇరాన్తో కుదిరే ఒక పెద్ద ఒప్పందంలో భాగంగా ‘అబ్రహం ఒప్పందాల’లో చేరాలని పిలుపునిచ్చారు. అబ్రహం ఒప్పందాలపై అన్ని దేశాలు తక్షణమే సంతకాలు చేయాలని తాను గట్టిగా కోరుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్తో సంబంధాల కోసం యూఏఈ, బహ్రెయిన్ సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పరిణామం పశ్చిమాసియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ట్రంప్ ఆహ్వానం మేరకు ఒప్పందంలో చేరితే పాలస్తీనా హక్కులను గౌరవిస్తాయా? అన్న చర్చ మొదలైంది.
అబ్రహం ఒప్పందం ఏంటి?
అబ్రహం ఒప్పందాలు అనేవి 2020లో అమెరికా ప్రారంభించిన ఒక ఒప్పందం. దీని ప్రకారం అనేక అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలను ఏర్పరచుకుని.. దానిని గుర్తించాయి. ఈ ఒప్పందంలో మొదటగా యూఏఈ, బహ్రెయిన్ చేరగా.. ఆ తర్వాత మొరాకో, సూడాన్ కూడా చేరాయి. అరబ్-ఇజ్రాయెల్ శత్రుత్వాన్ని తగ్గించడం, వాణిజ్య, రక్షణ సహకారాన్ని పెంచడం, ఇంకా ఇరాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడం దీని లక్ష్యం.
అయితే పాకిస్థాన్ ఈనాటికీ ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించలేదు. పాకిస్థాన్ స్థాపన ‘ముస్లిం గుర్తింపు’ రాజకీయాలు, పాలస్తీనాకు మద్దతుపై ఆధారపడి ఉంది. అందువల్ల పాకిస్థాన్ ఎప్పుడైనా అబ్రహం ఒప్పందాల్లో చేరితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అబ్రహం ఒప్పందాల్లో పాకిస్తాన్ పాల్గొనడం అంటే ‘‘పాలస్తీనా వాదాన్ని’’ విడిచిపెట్టడమే. ఇది పాకిస్థాన్లో తిరుగుబాటుకు దారితీయగల ఒక సున్నితమైన అంశం. అందువల్లే తాజాగా లష్కరే తోయిబా భారీ విధ్వంసం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
