Lal Darwaza Bonalu: హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు వేళ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. ఏటా ఆషాఢమాసంలో వైభవంగా జరిగే ఈ జాతర కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ అనంతరం దేవాలయం తరఫున తొలి బోనం సమర్పించారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరఫున ఉదయం 10:30 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు బోనాలు, ఒడి బియ్యం, చీర, సారెను అమ్మవారికి నివేదించనుండగా, సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం వైభవంగా జరగనుంది. లాల్ దర్వాజాలోని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల్లోని దాదాపు 3,000 చిన్న దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్త్రృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఆవరణ చిన్నది కావడంతో భక్తుల కోసం 6 ప్రత్యేక క్యూలైన్లను, బోనం తీసుకొచ్చే వారికి ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్లు, ఉచిత వైద్య శిబిరాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. ముందస్తు సమాచారం అందించిన జోగిణులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. ఇది సున్నితమైన ప్రాంతం కావడంతో 100 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు 2,500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున ప్రతిష్టాత్మక ‘రంగం’ భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్రతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

