KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. కంచన్బాగ్ – గచ్చిబౌలి మధ్య 400 ఎకరాల భూముల వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’ అంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఆధికారులను జైలుకు పంపినా తప్పు కాదు’’ అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, ఇది ప్రభుత్వానికి పెద్ద నింద అని పేర్కొన్నారు. అలాగే ఆత్మాభిమానమున్న ఏ సీఎం అయినా ఇలాంటి పరిణామాల అనంతరం రాజీనామా చేస్తారు. కానీ, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానమే లేదు అంటూ విమర్శించారు. ఈ వివాదంలో పర్యావరణ ప్రేమికుల విజయం సాధించారని కేటీఆర్ అన్నారు. ఈ భూముల యాజమాన్యంపై స్పష్టత వచ్చే వరకూ కట్టడాలు నిర్మించకూడదు, లీజుకు ఇవ్వకూడదు అని సెంట్రల్ కమిటీ చెప్పింది. ఇది మేము గత వారం చెప్పిన మాటలే అని పేర్కొన్నారు.
ఇది ఉద్దేశ్యపూర్వక విధ్వంసమని, స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘సీబీఐ, సీబీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జీలతో విచారణ చేయించాలి. లేకుంటే మోడీ కూడా దీనిలో భాగం అనే అనుమానం ప్రజల్లో ఉత్పత్తి అవుతుంది అని హెచ్చరించారు. రోహిత్ వేముల ఘటన సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారని గుర్తు చేసిన కేటీఆర్, ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఎప్పుడు పిలిచినా వస్తానన్నవాడు ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అని విమర్శించారు.
గత ఏప్రిల్లో ప్రధాని మోడీ తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఏడాది తర్వాత అదే మోడీ పర్యావరణం పాడవుతోంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. సెంట్రల్ కమిటీ చెరువుల గురించి స్పష్టంగా మాట్లాడింది. చెరువుల్ని తాకట్టు పెడతారా అని ప్రశ్నించింది. బీజేపీకి చెందిన ABVP కూడా దీనిపై ఉద్యమం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ అత్యుత్సాహం చూపే అధికారులపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం. అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టు వెళతాం అని ఆయన తెలిపారు. ఫార్ములా – ఈ కేసులో నేనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నాను. అధికారులపై తప్పు తీయలేదని స్పష్టం చేశారు.
