బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కవిత సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతో.. సొంత కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే కవిత మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత సస్పెన్షన్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు.
కవిత వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం అని, మరలా మాట్లాడానికి ఏమీ లేదన్నారు. ఒకసారి ఆక్షన్ తీసుకున్నాక నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పారు. కవితపై చర్యలు తీసుకున్నాక ఇక మాట్లాడేదేమి లేదని పేర్కొన్నారు. కవిత విషయంపై ఎక్కువగా మాట్లాడానికి కేటీఆర్ ఆసక్తి చూపలేదు. ఒక్క ముక్కలో కవిత సస్పెన్షన్పై క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న మూసీ నది పునరుజ్జీవం శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ లేదా మల్లన్నసాగర్ వద్ద చేయాలని.. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుండె కాయను వదిలిపెట్టి.. గండిపేట వద్ద చేస్తున్నారు. ఇవాళ గండిపేటకు మీరు తెస్తున్నది కాళేశ్వరం జలాలు కాదా?, మల్లన్న సాగర్ నుంచే నీరు హైదరాబాద్కు తీసుకొస్తున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ తపైనే దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
