KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!

Ktr

Ktr

KTR: NEET పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన ఆయన “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి” అంటూ నినాదాలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, వారి వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితిని చూసిన తర్వాత ఇద్దరు పిల్లలకు తండ్రిగా తాము ఒక నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థులకు అండగా నిలవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.

ప్రజా ఉద్యమాల పట్ల తమ పార్టీకి ఎప్పుడూ గౌరవం ఉంటుందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటనలు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని, విద్యార్థులపై జరిగిన దాడులు బాధాకరమని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. “పిల్లలు ప్రధాని పదవి అడిగారా.? వారికి కావాల్సింది న్యాయం మాత్రమే” అని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూనే సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను ప్రస్తావిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష తరహాలోనే ఆయన కూడా పోరాడుతున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. “మేకిన్ ఇండియా అడిగితే.. లీకిన్ ఇండియా ఇచ్చారు” అంటూ వ్యాఖ్యానించారు. యువత ఇప్పుడు జవాబుదారీతనం కోరుతోందని, గత 25 రోజులుగా ఢిల్లీలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, యువత పోరాటం చేస్తున్నారని చెప్పారు. వారిపై జరుగుతున్న దాడులు అత్యంత దారుణమని, వారికి సంఘీభావం తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.

ఢిల్లీ ఘటనలను అమానుషమని అభివర్ణించిన కేటీఆర్, పోలీసులు విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు. మీడియా సహకారం లేకపోయినా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాడిందని అన్నారు. “ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. రాజ్యమా ఉలిక్కిపడు.. ఈ తరం చావుకు భయపడే తరం కాదు. ఐటీ, ఈడీ దాడులకు భయపడే తరం కూడా కాదు” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.