నేడు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి ఉదయం 9. 30 గంటలకు శాసనసభ మండలి ఛైర్మన్ కార్యాలయంలో జరుగనుంది. అయితే, నిన్న (సోమవారం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలికి వెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. చివరకు ప్రమాణం చేయకుండానే వీరు ఇరువురు వెనుదిరిగి వెళ్లిపోయారు. మండలి చైర్మన్ కు సమాచారం ఇవ్వకుండా రావడం వల్ల ఇలా జరిగిందన్నారు.
అయితే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లు ఫోన్లో సంప్రదించినా ఆయన టచ్లోకి రాలేదని చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.. ఈ క్రమంలోనే మండలి చైర్మన్ అందుబాటులో లేరని టాక్. దీంతో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామనే విషయాన్ని చైర్మన్ కు చేరవేయాలని మండలి సెక్రటరీకి ఎమ్మెల్సీలు వెల్లడించారు. అయితే, గురువారం ప్రమాణానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులకు సూచించినట్లు సమాచారం.