తిరుపతిలో సంచలనం రేపిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ (SFI) నేతలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : Budget Problems : భారీ బడ్జెట్ సమస్యతో ఆగిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్
ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ను ఏ-1గా , నటుడు మంచు విష్ణును ఏ-2 గా ఆయన తండ్రి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబును ఏ-3 గా ఎఫ్ఐఆర్లో వారిని కీలక నిందితులగా చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో పీఆర్ఓ సతీష్తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం మరియు ప్రాథమిక ఆధారాల మేరకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసులో పోలిసుల విచారణకు మంచు మోహన్ బాబు, విష్ణు హాజరవుతారో లేదో చూడాలి.
