Kerala Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ సందడి ఒక్కసారిగా పెరిగింది. అధికార సిపిఐ(ఎం) తమ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తూ కీలక ప్రకటన చేసింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను సీపీఐ(ఎం) 86 స్థానాల్లో నేరుగా పోటీ చేయనుంది. మిగిలిన 54 స్థానాలను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) లోని ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది.
READ ALSO: Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. భవిష్యత్తు మార్కెట్ అంచనాలు ఇవే..
ప్రధాన అభ్యర్థులు వీరే..
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత గడ్డ అయిన కన్నూర్ జిల్లాలోని ధర్మదం (Dharmadom) నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇది సీపీఐ(ఎం)కు బలమైన కోటగా పేరుగాంచింది. మాజీ ఆరోగ్య మంత్రి, సీనియర్ నాయకురాలు కె.కె. శైలజ ఈసారి కన్నూర్ జిల్లాలోని పేరావూర్ (Peravoor) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆమె మట్టనూర్ నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేరావూర్ సీటు కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (KPCC) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ప్రాతినిధ్యంలో ఉంది. అభ్యర్థుల ఎంపిక అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ తెలిపారు. కేరళలో ఎల్డీఎఫ్ (LDF) వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందని సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూల్..
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఫలితాల తేదీలను ఎన్నికల సంఘం ఈ రోజే ప్రకటించింది. ఏప్రిల్ 9, 2026 పోలింగ్ జరుగుతుండగా, మే 4, 2026 ఫలితాల వెలువడనున్నాయి. కేరళతో పాటు అస్సాం, పుదుచ్చేరిల్లో కూడా ఏప్రిల్ 9నే పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
READ ALSO: IPL 2026: కేకేఆర్ కెప్టెన్గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!