Kenya : కెన్యాలో దారుణం జరిగింది. ఓ చర్చి పాస్టర్ నిర్వాకం కారణంగా 200మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నెల రోజులనుంచి కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు అధికారులు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. మరో 600 మంది జాడ గల్లంతైంది. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ 2019లో అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో జీవం విడిస్తే .. జీసెస్ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు.
Read Also: GVL Narasimharao: టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ!
ఇలా చేస్తూ డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి ఏప్రిల్ నెలలో మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. చాలా మంది ఆహారం తినకుండా, గొంతు పిసికినట్లు, ఆయుధాలతో దాడి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. మెకంజీ చర్చీలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు.
Read Also: Dutch Man : తండ్రితో మాట్లాడాలని ఉందంటూ.. శవాన్ని ఏడాదిన్నర ఫ్రిజ్ లో పెట్టాడు