Site icon NTV Telugu

KCR : తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలి

Kcr

Kcr

తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రాసిన ఈ పుస్తకం రాజకీయ, సామాజిక మార్పులు, రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఆయన రాసిన వార్తా కథనాల సంకలనం. తెలంగాణ ఉద్యమాన్ని, అభివృద్ధిని సరళంగా, అర్థమయ్యే రీతిలో వివరించడంలో శ్రీనివాస్ యాదవ్ కృషిని చంద్రశేఖర్ రావు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కవులు, కళాకారులు ఏ విధంగా ఏకమయ్యారో గుర్తుచేస్తూ ప్రజలతో పాటు రచయితలు నిలబడటం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న రచయితలు, కవులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రయత్నాలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

సుదీర్ఘ పోరాటం, త్యాగాలతో సాకారం చేసుకున్న తెలంగాణను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనం చేస్తోందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, సమాజంలోని వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్న కష్టాలను, గత దశాబ్ద కాలంగా బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న స్థిరత్వానికి భిన్నంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, రచయిత గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version