కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జారీ చేసిన పాఠశాల యూనిఫాం నిబంధనలను ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది. గతంలో అమల్లోకి వచ్చిన యూనిఫాం ఆదేశాల కారణంగా హిజాబ్ ధరించే అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు హిజాబ్, పవిత్ర దారాలు వంటి మతపరమైన గుర్తింపులను ధరించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్యా వాతావరణానికి భంగం కలగకుండా ఉండాలని కూడా సూచించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. హిజాబ్ వివాదం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక రాజకీయ అంశంగా మారిన విషయం తెలిసిందే.
కొత్త ఉత్తర్వు ప్రకారం.. ప్రీ-యూనివర్సిటీ కళాశాలలతో సహా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులు.. నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంధ్యం), రుద్రాక్ష, శివధార, శరవాస్త్ర వాటిని ధరించవచ్చు. ఇవన్నీ యూనిఫామ్కు అదనంగా మాత్రమే ధరించవచ్చని.. వాటి స్థానంలో మాత్రం ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. అవి క్రమశిక్షణ, భద్రత లేదా విద్యార్థి గుర్తింపుపై ప్రభావం చూపకూడదని కూడా పేర్కొంది. ఈ చిహ్నాలను ధరించమని గానీ, ధరించవద్దని గానీ ఏ విద్యార్థినీ బలవంతం చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. అయితే పరీక్షల సమయంలో అధికారులు నిర్దేశించిన దుస్తుల నియమావళి వర్తించవచ్చు. దుస్తుల విషయంలో ఏ విద్యార్థి కూడా వివక్షకు లేదా అవమానానికి గురికాకుండా చూసుకోవాలని పాఠశాల, కళాశాల అధికారులకు కూడా సూచించడం జరిగింది.
The Karnataka government withdrew its February 5, 2022, order, yesterday, on school and college uniforms and issued fresh guidelines permitting students to wear 'limited traditional and faith-based symbols' along with prescribed uniforms, with immediate effect.
The move comes…
— ANI (@ANI) May 13, 2026
