కరీంనగర్ నగరవాసులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘సిటీ మెట్రో ఎక్స్ప్రెస్’ బస్సులను జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న నగర జనాభా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశలో భాగంగా ఆర్టీసీ కరీంనగర్ 2 డిపో పరిధిలో మూడు బస్సులతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇవి ప్రధానంగా వాగేశ్వరి కాలేజీ, చింతకుంట, కొత్తపల్లి హవేలీ రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నగరం స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో.. వివిధ ప్రాంతాలలోని విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలకు తక్కువ ఖర్చుతో కూడిన సురక్షితమైన, సమయపాలనతో కూడిన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
కరీంనగర్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వ్యాపార కేంద్రాలను అనుసంధానిస్తూ ఈ రూట్లను రూపొందించారు. దీనివల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం తగ్గి, రవాణా ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడి , కాలుష్యం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. మహిళలు, విద్యార్థినులకు ఈ బస్సులు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మూడు మార్గాల్లోనే ఈ బస్సులు నడుస్తున్నప్పటికీ, ప్రజల నుండి వచ్చే ఆదరణ, డిమాండ్ను బట్టి రాబోయే రోజుల్లో మిగిలిన రూట్లకు కూడా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ , ఆర్టీసీ అధికారులు కోరారు.

