‘నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’ అని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని, మీకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుందని.. ఇందులో భాగంగానే మొదటగా తనను బయటకు పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు.. మన ముగ్గురం (కేసీఆర్, కేటీఆర్, కవిత) కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని కవిత చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ‘నాన్న, అన్న, నేను కలిసి ఉండటం బీఆర్ఎస్ పార్టీలో చాలా మందికి ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమయితే కొందరికి అధికారం వస్తుంది. ఆ కుట్రలో భాగంగా ముందుగా నన్ను బయటకు పంపించారు. నాన్నా మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. రానున్న రోజుల్లో మీకు, అన్నకు ప్రమాదం పొంచి ఉంది. బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోంది. డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు ఇదంతా చేస్తున్నారు’ అని చెప్పారు.
Also Read: Kalvakuntla Kavitha: నాన్న నిర్ణయాన్ని శిరసావహిస్తుస్తా?.. ఏ పార్టీలో చేరను!
మీడియా సమావేశం అనంతరం కవిత చిట్ చాట్లో పాల్గొన్నారు. ‘మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ లే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్ ఫోటోతోనే నేను కార్యక్రమాలు చేపడతాను. నేను కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావు’ అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసినట్లు కవిత అధికారికంగా ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.