కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న కారణంగా.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శక విచారణ కోసం సీబీఐకి కేసు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకొంది. ఆదివారం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించగా.. సభ ఆమోదించింది. ఇక సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం పంపింది.
Also Read: DK Aruna: కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే నమ్మేస్తారా?
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలుశాఖల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. అంతర్రాష్ట్ర అంశాల పైనా దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైనా దర్యాప్తు చేయాలని హోంశాఖకు పంపిన లేఖలో పేర్కొంది. సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరిస్తే.. కాళేశ్వరం బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల)పై దర్యాప్తు మళ్లీ ప్రారంభం అవుతుంది. సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చూడాలి మరి.
