Kakumanu Rajasekhar: ఎంత అణిచి వేయాలని చూస్తే.. అంత పెద్దగా ఎదుగుతాం!

  • అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్‌ని వేదిస్తున్నారు
  • గూండాలతో దాడి చేయించాలని చూశారు
  • జగన్ వెళ్తుండగా అసలు టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారు
Ycp Leader Kakumanu Rajasekhar

Ycp Leader Kakumanu Rajasekhar

కూటమి ప్రభుత్వ నేతలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్‌ని వేధించాలని చూస్తున్నారని వైసీపీ పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలు ఎంత అణిచివేయాలని చూస్తే.. తాము అంత పెద్దగా ఎదుగుతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి.. సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోందన్నారు. రైతుల పరామర్శకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు అమరావతిలో కాకుమాను రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.

Also Read: AP Govt: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. వారికి తప్పనిసరిగా బదిలీ!

‘వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోంది. అందుకే అక్రమ కేసులు పెట్టి మా కేడర్‌ని వేధించాలని చూస్తున్నారు. పొదిలిలో రైతులపై అక్రమ కేసులు పెట్టారు. రైతుల పరామర్శకు వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారు. హెలిప్యాడ్ నుండి పొగాకు బోర్డు దగ్గరకు వెళ్తుండగా టీడీపీ గూండాలతో దాడి చేయించాలని చూశారు. జగన్ వెళ్తుండగా అసలు టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారు?. ఒక కుట్ర ప్రకారమే రాళ్ల దాడి చేసి కానిస్టేబుల్, వైసీపీ కార్యకర్తలను గాయపరిచారు. అయినప్పటికీ తిరిగి మా వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రౌడీలు, గూండాలను అరెస్టు చేస్తున్నట్టు అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా కేడర్‌ని పరామర్శించటానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మమ్మల్ని ఎంత అణిచివేయాలని చూస్తే అంత పెద్దగా ఎదుగుతాం’ అని కాకుమాను రాజశేఖర్ అన్నారు.