Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!

Karapa Theft Gold

Karapa Theft Gold

కాకినాడ జిల్లా కరప మండలంలో జరిగిన ఓ విచిత్ర దొంగతనం ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంట్లో చోరీ చేసిన దొంగలు కొద్ది రోజులకే క్షమాపణ లేఖ రాసి దొంగిలించిన బంగారం, నగదును ఇంట్లోకి విసిరి వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.

కరపలో స్థానికంగా నివాసముంటున్న గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దుండగులు సుమారు రూ.6.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే రూ.50 వేల నగదు అపహరించారు. ఈ ఘటనపై గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ దొంగతనానికి తెలిసిన వారే కారణమై ఉండొచ్చని అతనికి అనుమానం మొదలైంది.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. భయపడిన దొంగలు దొంగిలించిన బంగారం, మిగిలిన నగదును గణేష్ ఇంట్లోకి విసిరి వెళ్లిపోయారు. వాటితో పాటు ఒక లేఖను కూడా పెట్టారు. ‘మేము చేసిన పని తప్పే. దొంగిలించిన నగదులో రూ.22 వేలు మా వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశాం. ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేం. మమ్మల్ని క్షమించండి’ అని లేఖలో రాసి పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించారు. తెలిసిన వారే ఈ పని చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిజం ఒప్పుకుంటే సమస్యలు సమసిపోతుందని, లేకపోతే కుల సంప్రదాయాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ పెద్దల హెచ్చరికతో ముగ్గురు యువకులు తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మిగిలిన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.