KA Paul Fires on TRS and BJP
మునుగోడులో ప్రచారం జోరుమీదుంది. రోజు రోజుకు ప్రచారంలో వేడి పెరుగుతోంది. అయితే.. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. నేడు స్ర్కూట్ని ప్రక్రియ జరుగుతోంది. నల్లగొండ జిల్లా చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఈ స్క్రూట్ ని జరుగుతోంది. అయితే.. ఈ స్క్రూట్నీకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నా తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపించారని, నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు… జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించారు. పది తులాల బంగారం ఇచ్చినా తీసుకొని ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.
కేసీఆర్ కమ్యూనిస్టులను కొనేశాడని, మునుగోడులో నన్ను గెలిపిస్తే ఉచిత విద్య వైద్యం, నిరుద్యోగులకు, ఉపాధి, ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మంచినీరు, రోడ్లు కాలేజీ యూనివర్సిటీ ఆరు నెలల్లో చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ మారిన సర్పంచ్ లకు రెండు కోట్లు ఇస్తున్నారని, మునుగోడు ప్రజలు తెలివితేటలు వాడి ఇచ్చిన డబ్బు తీసుకొని నన్ను గెలిపించండని ఆయన అన్నారు. బీజేపీకి బీ పార్టీగా బీఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడని, అభివృద్ధి చేయనందుకే గల్లి గల్లీకి ఓ కీలక నేతను అధికార పార్టీ బరిలోకి దింపిందన్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం కంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండడమే బెటర్ అని, రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆయన ఆరోపించారు.