జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగులకు , అర్హులైన అభ్యర్థులకు పౌర సరఫరాల శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలను రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శ్రీనివాసరావు బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఖాళీలు ఉన్న గ్రామాల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 మండలాల్లోని 14 గ్రామాల్లో ఎఫ్.పి.ఎస్ (FPS) డీలర్ల భర్తీ చేపట్టనున్నారు. అలంపూర్ మండలంలో అలంపూర్, క్యాతూర్.. ఉండవెల్లి మండలంలో బోన్కూర్, మానోపాడు మండలంలో.. చండూరు, నారాయణపూర్. అయిజ మండలంలో జడదొడ్డి, కూడకనూరు, అయిజ.. రాజోలి మండలంలో పడమటిగార్లపాడు, పచ్చర్ల.. వడ్డేపల్లి మండలంలో పైపాడు.. ఎర్రవల్లి మండలంలో వల్లూరు, రాజశ్రీ గార్లపాడు.. ఇటిక్యాల మండలంలో మొగిలిరావలచెరువు గ్రామల్లో ఈ రేషన్ డీలర్ల ఖాళీలు ఉన్నాయి.
Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నివాసితులై ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండటంతో పాటు, రిజర్వేషన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ పద్ధతిని అనుసరిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ..
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రతి గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ వివరాలు, అవసరమైన ధ్రువపత్రాల జాబితా , దరఖాస్తు ఫారాలు తహసీల్దార్ కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటాయి.
పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15, 2026 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఆర్డీఓ స్పష్టం చేశారు. స్థానిక యువత, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. త్వరలోనే కొత్త డీలర్లను నియమించడం ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీని మరింత సులభతరం చేయడమే ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశం.