Jemimah Rodrigues: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాను భారత స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కౌగిలించుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఒక్క ఘటనతో భారత స్టార్ క్రికెటర్ జెమిమా వివాదంలో చిక్కుకుంది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆసియా కప్ 2025, టీ20 ప్రపంచకప్ 2026తో పాటు యు-19, మహిళల మ్యాచ్లలో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రీడాకారులతో ‘నో-హ్యాండ్షేక్’ విధానాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ది హండ్రెడ్ లీగ్లో జెమిమా, ఫాతిమాను ఆలింగనం చేసుకోవడంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ ముగిశాక ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున వాదనలు మొదలయ్యాయి. “సైనికుల త్యాగాలను మరిచావా?” అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దేశ సైనికుల త్యాగాలను విస్మరించి ఇలా హద్దులు మీరడం సరికాదని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇది ఐసీసీ టోర్నమెంట్ కాదని, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ లీగ్లలో ఇండియన్ యాజమాన్యాల ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లపై నిషేధం విధించవచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను ఎంపిక చేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక, ఇది బీసీసీఐ పరిధిలోని మ్యాచ్ కాకపోవడంతో జెమీమా నిబంధనలను పక్కనపెట్టి ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ వివాదం పక్కన పెడితే, మైదానంలో జెమిమా తన అద్భుత ప్రదర్శనతో మెరిసింది. బర్మింగ్హామ్ ఫినిక్స్తో జరిగిన మ్యాచ్లో సదర్న్ బ్రేవ్ తరఫున ఆడిన జెమిమా 18 బంతుల్లో 28 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో సదర్న్ బ్రేవ్ నిర్ణీత బంతుల్లో 140/3 భారీ స్కోరు సాధించింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ ఫినిక్స్ జట్టుకు ఓపెనర్లు డావినా పెరిన్ (52), టామీ బ్యూమోంట్ (22) తొలి వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మంచి శుభారంభం ఇచ్చారు. అయితే ఈ జోడీ నిష్క్రమించిన తర్వాత బ్రేవ్ బౌలర్లు మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. లారెన్ బెల్, సారా గ్లెన్ వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. కెప్టెన్ సోఫీ మోలినెక్స్ (2/24), లారెన్ బెల్ (1/16) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఫినిక్స్ జట్టు 116/5 పరుగులకే పరిమితమైంది. ఎల్లిస్ పెర్రీ 16 పరుగులతో, ఫాతిమా సనా 5 పరుగులతో నాటౌట్గా నిలిచారు. చివరికి సదర్న్ బ్రేవ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి, టోర్నీలో వరుసగా నాలుగో గెలుపుతో తమ విజయపరంపరను కొనసాగించింది.

