Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ ‘ఆకిబ్ నబీ’ ఎంట్రీ..!

  • గాయం కారణంగా శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం ..
  • బుమ్రా స్థానంలో జమ్మూకశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీని BCCI ఎంపిక
  • ఆకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో ఇదే తొలి అవకాశం..
Aaqib Nabi

Aaqib Nabi

Aaqib Nabi: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని జమ్మూకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ‘ఆకిబ్ నబీ’ని జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఆకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో చోటు దక్కడం ఇదే మొదటిసారి.

ఎడమ మోకాలి గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో చివరి నిమిషంలో అతడిని శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం చేయాల్సి వచ్చింది. బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ సెలెక్టర్లు ఆకిబ్ నబీపై విశ్వాసం ఉంచారు.

అయితే ఆకిబ్ నబీకి అవకాశం రావడానికి ప్రధాన కారణం.. దేశవాళీ క్రికెట్‌లో అతని అద్భుత ప్రదర్శనే. గత రెండు రణజీ ట్రోఫీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టి తానేంటో చెప్పకనే చెప్పాడు. ఇందులో 2025-26 సీజన్‌లో ఒక్క సీజన్‌లోనే 60 వికెట్లు తీసి జమ్మూకశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యనే శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-A జట్టులో కూడా ఆకిబ్ నబీ చోటు దక్కించుకున్నాడు. అక్కడ రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకకు బయలుదేరనుంది. అనంతరం ఆగస్టు 7 నుంచి కొలంబోలో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలేలో ప్రారంభం కానుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.

శ్రీలంక పర్యటనకు భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (C), కేఎల్ రాహుల్ (VC), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, గుర్‌నూర్ బరార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.