Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి

Jagityal

Jagityal

Jagtial: జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందడంతో విషాదాన్ని ఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం, ఒకే తరగతి (యూకేజీ) చదువుతూ, నిత్యం కలిసి మెలిసి ఆడుకునే స్నేహితులు హరిస్మిత (6), వరుణ్ తేజ (6)లు విషజ్వరాల బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం వరుణ్ తేజ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం హరిస్మిత కన్నుమూసింది. ఈ ఇద్దరు చిన్నారులు విషజ్వరాల వల్ల కలిగిన తీవ్ర అస్వస్థతతోనే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ వరుస మరణాలతో తక్షణమే స్పందించిన ఆరోగ్య శాఖ, పొరండ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామంలో విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బంది ఈ రోజు నుంచి ప్రతి ఇంటికీ తిరుగుతూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో గ్రామంలో సుమారు 20 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తులు ఎవరూ అధైర్యపడకూడదని, ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కొద్దిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి లేదా గ్రామంలోని ప్రత్యేక వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.