మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురక్షితంగా ప్రయాణించేందుకు కనీసం ఒక నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 18 కోట్లు) వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే చమురులో 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. ప్రస్తుతం ఇరాన్ ఆంక్షల వల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయి.
రంగంలోకి అమెరికా యుద్ధ నౌక..
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తన తర్వాత ప్లాన్ ఏంటనేది స్పష్టం చేయడం లేదు. అయితే.. తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం 2,200 మంది సైనికులతో కూడిన ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ అనే భారీ యుద్ధ నౌక మధ్య ప్రాచ్య దేశాల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది భారత సముద్ర తీరానికి సమీపంలోనే ఉంది. ఇరాన్ తీర ప్రాంతంలో తన పట్టు పెంచుకోవడానికి అమెరికా ఈ నౌకను పంపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ ఏమన్నారంటే..?
సైన్యాన్ని పంపడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘నేను సైన్యాన్ని ఎక్కడికీ పంపడం లేదు. ఒకవేళ పంపాల్సి వచ్చినా ఆ విషయం మీకు ముందే చెప్పను కదా’ అంటూ మాట్లాడారు. కానీ, ఇరాన్ను అదుపు చేసేందుకు వేల సంఖ్యలో సైనికులను పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది.
భారత్కు ఊరట..
పశ్చిమ దేశాల నౌకలపై ఇరాన్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. భారత్ , పాకిస్థాన్లకు వెళ్లే చమురు నౌకలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇరాన్ తీరంలోని కొన్ని కీలకమైన ద్వీపాలను తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అమెరికా భావిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా తీసుకునే నిర్ణయాలపైనే ఈ యుద్ధం ఎటుపోతుంది అనేది ఆధారపడి ఉంది.