Iran: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఇరాన్పై తీవ్రమవుతున్నాయి. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ టాప్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని తుడిచిపెట్టినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలైన సౌదీ, ఖతార్, యూఏఈ, బహ్రైయిన్ వంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడి చేసింది.
Read Also: Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
ఇదిలా ఉంటే, ఈ దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. ఖమేనీ హత్య “ముస్లింలపై యుద్ధ ప్రకటన” అని ఆదివారం అన్నారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క అత్యున్నత రాజకీయ నేత, ప్రపంచవ్యాప్తంగా షియా మతానికి చెందిన ప్రముఖ నాయకుడి హత్య… ముస్లింలపై, ముఖ్యంగా షియాలపై, ప్రపంచంలోని ప్రతిచోటా బహిరంగ యుద్ధ ప్రకటనగా భావించబడుతోంది” ఒక ప్రకటనలో చెప్పారు. యూఎస్ ఇజ్రాయిల్ దాడుల్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఇజ్రాయిల్, యూఎస్లను హెచ్చరించారు.
ఈ దాడిపై ఉగ్ర సంస్థ హమాస్.. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరిగిన ఈ స్పష్టమైన దురాక్రమణ, దారుణమైన నేరానికి, అలాగే ఈ ప్రాంతం యొక్క భద్రత, స్థిరత్వంపై దాని తీవ్రమైన పరిణామాలకు అమెరికా మరియు ఫాసిస్ట్ ఆక్రమణ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తాయి.” అని చెప్పింది.
