అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్ల సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ లక్ష్యంగా తాము ‘క్రూయిజ్ క్షిపణి’ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను అమెరికా నౌక ఉన్న దిశగా వదిలినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ దాడిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కొద్దిరోజులుగా ఇరాన్ నౌకాదళం అమెరికాను నేరుగా హెచ్చరిస్తూనే ఉంది. అమెరికా యుద్ధ నౌక తమ నిఘాలో ఉందని.. అది గనుక ఇరాన్ సరిహద్దుల వైపు వస్తే దాడి చేస్తామని ముందే చెప్పారు. ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ మాట్లాడుతూ.. అమెరికా నౌకను తాము నిరంతరం గమనిస్తున్నామని, తమ క్షిపణి పరిధిలోకి అది రాగానే కొట్టి పారేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని 48 గంటల గడువు ఇచ్చారు. అయితే.. ఇరాన్ కూడా గట్టిగా స్పందిస్తూ.. తమపై దాడి చేస్తే పశ్చిమాసియాలోని ఇంధన వనరులన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. దీనితో ట్రంప్ తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Also Read:Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
అమెరికా తన పవర్ పోయిందని ఒప్పుకోలేక, ఏదో ‘చర్చలు’ జరిగాయని అబద్ధాలు చెబుతోందని ఇరాన్ సైనిక అధికారులు ఎద్దేవా చేస్తున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్తో మంచి చర్చలు జరిగాయని పోస్ట్ చేశారు. కానీ, ఇరాన్ మాత్రం అసలు చర్చలే జరగలేదని స్పష్టం చేసింది. ‘అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఓటమిని చవిచూస్తోంది. మీ ఓటమిని ఒక ఒప్పందంగా చిత్రీకరించకండి’ అని ఇరాన్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫాకారి మండిపడ్డారు.
పశ్చిమాసియాలో శాంతి ఉండాలా లేదా అనేది ఇప్పుడు ఇరాన్ సైనిక శక్తి మీద ఆధారపడి ఉందని, అమెరికా మాటలు నమ్మే రోజులు పోయాయని ఆయన పేర్కొన్నారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అనేది ఒక సాధారణ నౌక కాదు. ఇది ఒక ‘ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్’. అంటే సముద్రం మీద ప్రయాణించే ఒక చిన్న విమానాశ్రయం లాంటిది. దీని మీద నుంచి డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఏకకాలంలో దాడులు చేయగలవు. అందుకే దీనిపై దాడి అంటే అది నేరుగా అమెరికాతో యుద్ధానికి దిగడమే అవుతుంది. ప్రస్తుతానికి ఇరాన్ క్షిపణులు వదిలినట్లు చెబుతున్నా, అవి నౌకకు తగిలాయా లేదా అనేది స్పష్టత లేదు. ఒకవేళ అమెరికా దీనిపై ఎదురుదాడికి దిగితే పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది.
అయితే.. పాకిస్థాన్ ద్వారా అమెరికా పంపిన 15 పాయింట్ల శాంతి ప్రణాళిక చర్చల దశలో ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. హెచ్చరించిన గంట వ్యవధిలోనే ఇరాన్ ఈ సాహసానికి ఒడిగట్టడంతో, అగ్రరాజ్యం అమెరికా ఎలాంటి ప్రతిదాడికి దిగుతుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
