Hormuz Attack: అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ జలమార్గం సమీపంలో ప్రయాణిస్తున్న మూడు వేర్వేరు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC)కి చెందిన గన్బోట్లు ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే..
READ ALSO: RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) నివేదిక ప్రకారం.. ఓమన్కు ఈశాన్య దిశలో ప్రయాణిస్తున్న లైబీరియా జెండాతో ఉన్న ఒక కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడులు కేవలం తుపాకులతోనే కాకుండా, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడుల కారణంగా నౌకలోని ‘బ్రిడ్జ్’ భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు కెప్టెన్ ధృవీకరించారు.
గన్బోట్ కలకలం..
ఘటనకు ముందు ఒక IRGC గన్బోట్ తమ నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చిందని, ఆ బోటుపై ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఓడ సిబ్బంది తెలిపారు. గ్రీక్ నిర్వహణలోని మరో కంటైనర్ నౌక కెప్టెన్ మాట్లాడుతూ.. ఎటువంటి రేడియో సంకేతాలు ఇవ్వకుండానే తమపై కాల్పులు జరిపారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా ఈ దాడులు జరగడం గమనార్హం. తీవ్రమైన దాడులు జరిగినప్పటికీ, నౌకల్లోని సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అలాగే నౌకల్లో ఎటువంటి మంటలు చెలరేగలేదని, సముద్ర పర్యావరణానికి ఎటువంటి హాని (చమురు లీకేజీ వంటివి) జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, కీలకమైన ఈ సముద్ర మార్గంలో నౌకలపై దాడులు జరగడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయాలని సముద్ర భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
