ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది ఐపీఎస్ల పెళ్లి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐపీఎస్ జంట ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లో అజిత్ ప్యాలెస్లో అంగరంగా వైభవంగా వివాహం జరిగింది. ఈ మ్యారేజ్కు సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ వివాహమే ఉత్తరప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఐపీఎస్లు కేకే బిష్ణోయ్, అన్షికా వర్మల వివాహ ఆహ్వాన పత్రికలు సమాజ్వాదీ పార్టీ నాయకులకు కూడా అందాయి. అయితే ఈ పెళ్లికి నాయకులు దూరంగా ఉండాలని పార్టీ బహిరంగంగానే సూచించింది. కానీ విచిత్రమేంటంటే అధిష్టానం సూచనలు నాయకులెవరూ పాటించలేదు. రాజస్థాన్లో జరిగిన పెళ్లిలో ఎస్పీ నాయకులంతా ప్రత్యక్షమయ్యారు. అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన అతిథులతో.. ప్రజలతో సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా.. కొన్ని రీల్స్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హైకమాండ్ అదేశించినా కూడా మాట వినకుండా వివాహానికి హాజరై ఫొటోలకు ఫోజులివ్వడంపై అగ్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి ఉంది. అంతేకాకుండా కార్యకర్తల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం కాస్త పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్లో వార్నింగ్..
ఐపీఎస్ల పెళ్లికి వెళ్లొద్దని ఎస్పీ మీడియా సెల్ ఎక్స్లో బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. ఆ పోస్ట్లో ఐపీఎస్ కేకే బిష్ణోయ్ వివాదాస్పదుడు అని.. అంతేకాకుండా బీజేపీ మద్దతుదారుడు అని పేర్కొంది. ‘‘కుల, మత ప్రాతిపదికన సమాజంపై అఘాయిత్యాలకు పాల్పడిన బీజేపీకి చెందిన కొందరు అధికారులు, వ్యక్తులు, ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితిని గ్రహించి సోషలిస్టులను ఆశ్రయించేందుకు ప్రయత్నించవచ్చు. అటువంటి ‘‘అసాంఘిక శక్తుల’’కు దూరంగా ఉండటం. వారిని బహిర్గతం చేయడం సోషలిస్టుల బాధ్యత.’’ అని పోస్ట్లో తెలిపింది. రాజకీయ, సామాజిక నైతిక విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అయినా కూడా ఎస్పీ నాయకులు పెళ్లికి హాజరయ్యారు. ఒకింత అఖిలేష్ యాదవ్ వివాదాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నా.. సీనియర్ నాయకులు మాత్రం సీరియస్గా పరిగణిస్తున్నారు.
బిష్ణోయ్ వివాదాస్పదం..
ప్రస్తుతం సంభాల్ జిల్లా పోలీస్ చీఫ్గా ఉన్న కృష్ణ కుమార్ బిష్ణోయ్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. సంభాల్లోని జామా మసీదు సర్వే అనంతరం జరిగిన హింసాకాండలో బిష్ణోయ్ పాత్ర ప్రత్యేకంగా ప్రముఖంగా నిలిచింది. బుల్డోజర్ చర్యలు, నోటీసులు, అరెస్టులు, వైరల్ వీడియోలతో సహా పలు అంశాల కారణంగా రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారారు. బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ గతంలో ఆరోపించింది. ఎస్పీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బర్ఖ్, జామా మసీదుకు సంబంధించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటి నుంచి ఆ పార్టీ ఆయనను ‘‘వివాదాస్పద వ్యక్తి’’గా పరిగణిస్తుంది. ఇలాంటి తరుణంలో ఎస్పీ నాయకులు పెళ్లికి హాజరు కావడంపై సమాజ్వాదీ నాయకులు, కార్యకర్తలు కారాలు-మిరియాలు నూరుతున్నారు.
