NTV Telugu Site icon

IPL Auction 2025: ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. విదేశీ ప్లేయర్లకు నో లిమిట్! ఫుల్ డీటెయిల్స్ ఇవే

Ipl 2025 Retentions

Ipl 2025 Retentions

IPL 2025 Retentions List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంకు సంబంధించిన నిబంధనలు ఖరారు అయ్యాయి. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో మెగా వేలం నిబంధనలను అధికారులు రిలీజ్ చేశారు. ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్‌ పాలకవర్గం అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రాంఛైజీ పర్స్ వాల్యూ రూ.120 కోట్లు.

వేలం లేదా రిటెన్షన్ ద్వారా ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ప్లేయర్స్ ఐపీఎల్ 2027 వరకు కొనసాగాలి. రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఉండాలి. గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు అవకాశం ఉంది. మిగిలిన అయిదుగురు ఆటగాళ్లలో ఇండియన్స్ లేదా విదేశీ ప్లేయర్లు ఉండొచ్చు. విదేశీ ప్లేయర్లను తీసుకునేందుకు నో లిమిట్. అయిదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ.75 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.4 కోట్లుగా నిర్ణయించారు.

అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్‌లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అంటే పర్స్ వ్యాల్యూ రూ.120 కోట్లలో ఈ రిటెన్షన్‌కు రూ.75 కోట్లు పోతుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను కూడా రిటైన్ చేసుకుంటే.. రూ.41 కోట్లతోనే మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది. రూ.41 కోట్లతోనే మరో 15 మందిని కొనాల్సి ఉంటుంది.

Also Read: Fabulous Four: ‘ఫ్యాబ్ 4’గా బౌలర్లు.. భారత్ నుంచి ఇద్దరు!

ఏ భారత ఆటగాడైనా ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్ ఇచ్చి అయిదేళ్లు పూర్తయితే.. అతడు అన్‌క్యాప్డ్‌ ఆటగాడవుతాడు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కూడా 2027 సీజన్‌ వరకు కొనసాగనుంది. మరోవైపు 2025 నుంచి లీగ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ రూ.7.50 లక్షల మ్యాచ్‌ ఫీజు (ప్రతి మ్యాచ్‌కు)ను నిర్ణయించారు. అన్ని లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి అదనంగా రూ.1.05 కోట్లు దక్కుతుంది. ఒక ప్రాంచైజీ ఈ ఫీజుల కోసం మొత్తం రూ.12.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.