BCCI: ఐపీఎల్ (IPL) ప్రేమికులకు, ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) ఒక భారీ ఊరటనిచ్చే వార్తను పంచుకుంది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వరకు సాగే ఐపీఎల్ షెడ్యూల్ను 2027 సీజన్ నుంచి ముందుకు జరపాలని బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దేశంలో మే నెల చివరి వారాల్లో ఉండే విపరీతమైన ఎండలు, ముందస్తు వర్షాలని చెబుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ కూడా మార్చి 28 నుంచి మే 31 వరకు సాగింది. అయితే, భవిష్యత్తులో ఆటగాళ్లు, మైదానానికి వచ్చే ప్రేక్షకులు ఎండ తీవ్రతతో పాటు వాతావరణ మార్పుల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో టోర్నమెంట్ను మార్చి 10 నాటికే ప్రారంభించి, మే 15 కల్లా ముగించాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. నిజానికి 2024లోనే ఫ్రాంచైజీలకు పంపిన మూడేళ్ల తాత్కాలిక విండో ప్రకారం.. 2027 సీజన్ను మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పులు చేయనున్నారు.
ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. మే 15 తర్వాత టోర్నీ ముగింపు దశకు వచ్చేసరికి అటు ఎండలు మండిపోవడం, ఇటు కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకోవడం అందరు ఆటగాళ్లకు సాధ్యం కాదని, అభిమానుల నుంచి సైతం దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. అందుకే టోర్నమెంట్ను ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగించడమే తమ ప్రథమ లక్ష్యమని, దీనికోసం తగిన విండోలను పరిశీలించాల్సిందిగా గేమ్స్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్, మాజీ భారత పేసర్ అబే కురువిల్లాను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా 2027లో జరగబోయేది ఐపీఎల్ 20వ సీజన్ కావడంతో ఈ మైలురాయి ఈవెంట్ను ఎలాంటి వాతావరణ అడ్డంకులు లేకుండా గ్రాండ్గా నిర్వహించాలని బోర్డు పట్టుదలగా ఉంది.
ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య పెంపుపై వస్తున్న వార్తలకు సైకియా స్పష్టతనిచ్చారు. 2022లో 10 జట్లు అయినప్పటి నుంచి ఏడాదికి 74 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అయితే దీనిని పూర్తి డబుల్ రౌండ్-రాబిన్ పద్ధతిలో 94 మ్యాచ్లకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఎంతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతానికి మ్యాచ్ల సంఖ్య పెంచడం అస్సలు సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నో ఇబ్బందుల మధ్య విదేశీ బోర్డులను ఒప్పించి ఈ రెండు నెలల విండోను సాధిస్తున్నామని, దీనిని దాటి ముందుకు వెళ్లడం కుదరదన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి ఐసీసీ సభ్య దేశాల ద్వైపాక్షిక సిరీస్లు, మల్టీ-కంట్రీ టోర్నమెంట్లకు ఇబ్బంది కలిగించడం బీసీసీఐకి ఇష్టం లేదని, అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని, ప్రస్తుతానికైతే 94 మ్యాచ్ల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అయితే ఐపీఎల్ను మార్చి 10 నాటికే ప్రారంభించాలంటే భారత దేశవాళీ (డొమెస్టిక్) క్రికెట్ సీజన్ను అంతకంటే ముందే ముగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఎంతో బలీయమైన డొమెస్టిక్ వ్యవస్థ ఉందని, ఆగస్టు చివరి వారంలో ఇరానీ ట్రోఫీతో మొదలై మార్చి వరకు రంజీ ట్రోఫీ ఫైనల్తో దాదాపు 7 నుంచి 8 నెలల పాటు దేశవాళీ మ్యాచ్లు నిరంతరాయంగా సాగుతాయని సైకియా వివరించారు. ఇప్పుడు ఐపీఎల్ 2027ను అనుకున్న సమయానికి ప్రారంభించాలంటే, దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ను కాస్త కుదించి (సమీకరించి), మార్చి 10 లోపే రంజీ టోర్నీని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మార్పులు గనుక అనుకున్నట్లు జరిగితే, 2027 నుంచి ఐపీఎల్ సరికొత్త టైమింగ్స్తో మరింత జోష్గా సాగడం ఖాయం.

